బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అపెరల్ పార్క్ షెడ్ లలో ధాన్యం నిల్వ చేయాలి..
ధాన్యం తరలించే వాహనాలకు కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు..
అపెరల్ పార్క్ లో షెడ్లు, కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో షెడ్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా షెడ్లలో ధాన్యం నిల్వ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్ లోడింగ్ చేయాలని సూచించారు. హమాలీలకు త్రాగునీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అపెరల్ పార్క్ లో ఆరు షెడ్లు.. 12 కంపార్ట్మెంట్లు సిద్ధంగా ఉంచామని పౌర సరఫరాల శాఖ డీఎం రజిత తెలిపారు.

కొనుగోలు కేంద్రాల తనిఖీ
గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్, దేశాయిపేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలింపు నిమిత్తం రెండు వాహనాలు కేటాయించామని తెలిపారు. జిల్లాలో ధాన్యం తరలించడానికి వాహనాల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో హమాలీలు పని చేయాలని పేర్కొన్నారు.
