-వేములవాడలో భూసేకరణ పనులు వేగంగా చేయాలి..
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
వేములవాడ పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ, భూ సేకరణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతో పాటు, 350 కుటుంబాలకు నష్టపరిహారం కింద గజానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అభివృద్దిని అడ్డుకోవడం సరికాదనిఅన్నారు. వేములవాడ పట్టణంలో 50 ఏండ్లుగా రోడ్ల విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈసారి కచ్చితంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తామని అన్నారు. నష్టపరిహారం కింద 47 కోట్ల 80 లక్షల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని, నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తుందని అన్నారు.
వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు తొలగించాల్సిన సర్వే చేసి త్వరగా అందించాలనిఅన్నారు. విధుల్లో అలసత్వం వహించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
315 ఇండ్ల నిర్మాణాల ప్రతిపాదనలను 4 టీం ల ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఇప్పటి వరకు 257 ఇండ్లకు సంబంధించిన సర్వే పూర్తి చేసినట్లు, మిగిలినవి వీలైనంత త్వరగా అందిస్తామని అధికారులు తెలిపారు.
భూ సేకరణ చట్టం 2013 సెక్షన్ 12 ప్రకారం భూసేకరణ నిమిత్తం సర్వే చేసే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయనిఅన్నారు. చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని వారంలో మొత్తం భూ సేకరణ సర్వే పొరపాట్లు జరగకుండా పూర్తి చేసి ప్రతిపాదనలు అందిస్తే వెంటనే అవార్డులు అందజేస్తామని అన్నారు.కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, మున్సిపల్, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
