బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని పలువురు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేయడం సాధ్యమవుతుందని, అందుకే పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉందని అన్నారు. బలహీన వర్గాలకు కుల గణన జరపాలని, రాహుల్ గాంధీ ఇచ్చిన సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేసి దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు. బిసి లకు రాజకీయంగా విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో చట్టాన్ని చేయడం జరిగిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా, ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్షలో కూర్చున్నారని,కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి క్యాబినెట్లో ఆమోదింపజేసి దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించారని,ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని,చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు వేగవంతంగా కొనుగోలు చేస్తున్నామని,నిన్నటి రోజు ఇతర పార్టీ నాయకులు రోడ్డు ఎక్కి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాసంగి మే 01 నాటికి 2021-22 లో 233 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమావధి ముందుకు పోతున్నామని అన్నారు.