బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం తెలిపారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 లక్షల 99 వేల విలువైన 53 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనంతరం, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్ఓసీల ద్వారా ఇప్పటివరకు 20 కోట్లకు పైగా మంజూరు చేశామని చెప్పారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గత ప్రభుత్వంలో ఎల్ఓసీ అంటేనే తెలియదని, ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఉపయోగపడేలా అనేకమందికి ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రుద్రంగి, ఫాజుల్ నగర్ మండల కేంద్రాల్లో 1.43 కోట్ల రూపాయలతో కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.

రైతుల పేరుతో రాజకీయాలు మానుకోండి:
వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆది శ్రీనివాస్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామని, వర్షం పడి తడిసిన ధాన్యాన్ని కూడా తప్పకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ముసుగులో కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని, రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోతే ఇంటర్మీడియట్ గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేశామని చెప్పారు. వారం పది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని, ప్రతిరోజు అధికారులతో, రైతులతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని తెలిపారు. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

బీఆర్ఎస్ హయాంలో 2021-22లో మే 6 వరకు 1215 మెట్రిక్ టన్నులు, 2022-23లో మే 6 వరకు 32915 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ప్రజా ప్రభుత్వంలో 2023-24లో మే 6 వరకు 91560 మెట్రిక్ టన్నులు, 2024లో మే 6 వరకు 112405 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గణాంకాలు వివరించారు. రైతులు ఈ తేడాను గమనించాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని, రేవంత్ రెడ్డి రైతును రాజుగా చేయాలని ముందుకు సాగుతున్నారని అన్నారు.
కొన్ని విషయాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పద్ధతి ప్రకారం రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు అందించే సూచనలు, సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నామని, త్వరలోనే రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.