రుద్రంగి మానాల చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
బలగం టీవీ, రుద్రంగి:
రానున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులకు ఆదేశించారు. మంగళవారం రోజున జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్టు నందు అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా చెక్ పోస్టు వద్ద పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు, మద్యం వంటి అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహారించాలని అన్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.



