బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రిని కోరారు.
కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చదువుతున్న సుమారు 250 మంది విద్యార్థులకు పూర్తిస్థాయి ఫ్యాకల్టీ లేదని కేటీఆర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నలుగురు ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారని, వారికి గత నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు ఫ్యాకల్టీ మానేశారని, మిగిలిన ఇద్దరు కూడా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారని వివరించారు.
అంతేకాకుండా, విద్యార్థులకు కోర్సులకు అవసరమైన మెటీరియల్ గత మూడు నెలలుగా అందడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో, మెటీరియల్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యలపై తక్షణమే స్పందించి, ఫ్యాకల్టీ నియామకం, వేతనాల చెల్లింపు, మెటీరియల్ సరఫరా వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కేటీఆర్ మంత్రి లక్ష్మణ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.
