బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- నూతన దివ్యాంగులకు మీ సేవా ద్వారా యూ.డి.ఐ.డి కార్డు దరఖాస్తు
- సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి దివ్యాంగులకు డి.ఆర్.డి.ఓ లు యూ.డి.ఐ.డి జనరేట్ చేయాలి
- మార్చి 01 నుంచి సదరం సర్టిఫికెట్ విధానానికి స్వస్తి… నూతనంగా యూ.డి.ఐ.డి కార్డుల జారీ
- యూ.డి.ఐ.డి కార్డుల దివ్యాంగులకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతాయి
- సోలార్ విద్యుత్ ప్లాంట్ల డిపిఆర్ లను తయారు చేయాలి
యూనిక్ డిసేబులిటీ ఐ.డి జారీ, సోలార్ పవర్ ప్లాంట్ ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్
ప్రతి దివ్యాంగులకు యూ.డి.ఐ.డి నెంబర్ జనరెట్ చేయాలని పంచాయతీరాజ్ కార్యదర్శి దివ్య అన్నారు. శనివారం సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ సదరం సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ, సోలార్ పవర్ ప్లాంట్ ల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

సేర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదలు యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ చేయాల్సి ఉంటుందని, సదరన్ సర్టిఫికెట్ నుంచి ఈ కార్డు జారీ కు బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని అన్నారు.
దివ్యాంగులకు వైద్యులచే ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరన్ సర్టిఫికెట్ ను యూ.డి.ఐ.డి పోర్టల్ లో నమోదు చేయాలని, దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలని అన్నారు. దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటి అడ్రస్ కు అందుతుందని ఆమె తెలిపారు.
అందులకు విజన్, కుష్టి వ్యాధి గ్రస్తులు, వినికిడి సమస్య గలవారు, అంగవైకల్యం గలవారు, మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి యూ.డి.ఐ.డి కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు. నూతనంగా యూ.డి.ఐ.డి కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడిఐడి జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఫిబ్రవరి 28,2025 వరకు జారీ చేసిన సదరన్ సర్టిఫికెట్లతో చేయుట పెన్షన్, ఇతర సదుపాయాలను మన రాష్ట్రంలో దివ్యాంగులు పొందవచ్చని, ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డు తప్పనిసరి అని అన్నారు. మార్చ్ ఒకటి నుంచి దివ్యాంగులకు యూ.డి.ఐ.డి జారీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారానే పెన్షన్ ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల నిర్వహకులకు, పంచాయతీ కార్యదర్శులకు, విఓఏలకు , సీసీలకు ఎంపీడీవోలకు, ఏడిఎంలకు యూ.డి.ఐ.డి దరఖాస్తుల నమోదు పై అవగాహన శిక్షణ అందించాలని అన్నారు. ఆసుపత్రిలో యూ.డి.ఐ.డీ నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులు, పరికరాలు ఉండేలా చూడాలని, క్యాంపు అప్పుడు దివ్యాంగులకు కుర్చీలు త్రాగు నీరు ఇటువంటి వస్తువులు కల్పించాలని అన్నారు.
జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమన్వయం చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి నూతనంగా కావాల్సిన వస్తువుల ప్రతిపాదనలు అందజేయాలని ఆమె కలెక్టర్లకు సూచించారు. నూతనంగా యూ.డి.ఐ.డి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రి లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని, నిర్దారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూ.డి.ఐ.డి కార్డు జనరెట్ చేయాలని అన్నారు.
ప్రధానమంత్రి కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలలో స్థలాలను గుర్తించడం జరిగిందని, అక్కడ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేసే విధంగా డిపిఆర్లను తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శి సూచించారు. వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు, ప్రధానమంత్రి కుసం పథకం వినియోగించుకొని రైతులు మహిళా సంఘాల ద్వారా నడిపేలా చిన్న చిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక బద్ధంగా పని చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ.శేషాద్రి, డి.డబ్ల్యూ.ఓ.లక్ష్మీరాజం,అడిషనల్.డి.ఆర్.డి.ఓ.శ్రీనివాస్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.