కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బలగం టీవీ, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలోని ఐటీ హబ్లో తీవ్ర విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ రంగంలో పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సతీష్ (31) హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతను మియాపూర్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్లో తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.
ఇటీవల సంక్రాంతి పండుగ కావడంతో సతీష్ భార్య తన సొంతూరికి వెళ్లారు. అప్పటి నుండి ఇంట్లో ఒంటరిగానే ఉంటున్న సతీష్, తీవ్ర పని ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి (Work Stress) కారణంగానే సతీష్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
