బలగం టీవీ, హైదరాబాద్:
భారత రాష్ట్ర సమితి (భారాస) సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్లో నిర్వహించిన బహిరంగ సభ అపూర్వ విజయం సాధించింది. ఈ సందర్భంగా భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై తమ తిరుగులేని విశ్వాసాన్ని చాటారని ఆయన కొనియాడారు.
నిన్నటి సభతో తెలంగాణలో మరోసారి భారాస అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అభివర్ణించారు. ఈ సభ భారాస ప్రజాబలాన్ని మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. సభా కార్యక్రమాలను ప్రజలకు చక్కగా అందించిన మీడియాకు, మీడియా మిత్రులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో సిల్వర్ జూబ్లీ సభ ఒక గొప్ప విజయంగా నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ నిర్వహణలో కొంత లోపం ఉన్నప్పటికీ, లక్షలాది మంది ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడం వారి అభిమానానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఇంత భారీ బహిరంగ సభను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన భారాస నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు మరియు సోషల్ మీడియా వారియర్లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ చారిత్రాత్మక సభ విజయవంతమైందని ఆయన కొనియాడారు.