బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జిల్లాలో మలేరియాను సమూలంగా నిర్మూలించే ప్రక్రియలలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నిర్మూలనపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై, అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ మలేరియా వ్యాప్తి, వ్యాధి నిర్ధారణ, వైద్య సదుపాయం, వైద్యం అందించే విధానం తదితర అంశాలపై క్లుప్తంగా వివరించారు. జిల్లాలో గతేడాది మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు. దీనిలో భాగస్వామ్యులైన వైద్యులు, సిబ్బంది, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ ఇవే ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైద్యులు, సిబ్బంది తమ పరిధిలోని వార్డులు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, దోమతెరలు వాడాలని, దోమలు కుట్టకుండా చూసుకోవాలని తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాల్లో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఎక్కడైనా మురుగునీరు నిలిస్తే బ్లీచింగ్ పౌడర్ వేసి, ఆయిల్ బాల్స్ వేయాలని దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని దవాఖానాల్లో మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది మలేరియా లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు చేయాలని వారికి సరైన వైద్యం అందించాలనిఅన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,తమ ఇల్లు, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో.. ప్రజలు కూడా అలాగే తమ ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిత, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్, పీహెచ్ సీ డాక్టర్ సయ్యద్ సయిరా అంజుమ్, డాక్టర్లు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.