-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల
భూ సమస్యల పరిస్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ అనంతరం భూధార్ కార్డుల జారీ చేస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025పై అవగాహన సదస్సును సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ హాజరై మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు – భూ భారతి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిందని అన్నారు.
హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, భూముల మ్యాప్ జియో ట్యాగింగ్ తో పాస్ బుక్కులు జారీ చేస్తామని,పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని అన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేస్తారని, భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని, పాసుపుస్తకాలలో భూమి పటం ఉంటుందని అన్నారు. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని అన్నారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారత చట్టాన్ని తీసుకువచ్చిందని,రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారని,గ్రామ రెవిన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, ఇన్చార్జి తహసిల్దార్ విజయ్ భాస్కర్ రెడ్డి, అధికారులు సిబ్బంది, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.