- క్రీడలతో శారీరక, మానసిక అభివృద్ధి..
- ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యం చేరుకోవాలి..
- కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు ప్రారంభం
- అలరించిన విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు..
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
విద్యార్థులు చదువుతోపాటు ఆటలోనూ రాణించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025- 26 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరు కాగా, స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికారు. ఆటల పోటీల జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యం చేరుకోవాలని పిలుపు ఇచ్చారు. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని, ప్రతి రోజు గంట పాటు ఆటలు ఆడాలని సూచించారు. క్రీడలు, యోగా సాధనతో శారీరక, మానసిక సమతుల్యత, అభివృద్ధి సాధ్యమని వివరించారు. తరగతి గది పుస్తకాలతోపాటు లైబ్రరీ లోని ఇష్టమైన పుస్తకాలు, దిన పత్రికలు చదవాలని పేర్కొన్నారు. వివిధ అంశాలపై అవగాహన వస్తుందని వివరించారు. గత ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలని సూచించారు. దీంతో వార్షిక, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువు అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేషా ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

